
ఉక్రెయిన్ యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరుగుతోంది. రష్యా భూభాగంపై కీవ్ దాడులు పెంచుతున్న వేళ.. ఆ దాడుల్లో బ్రిటన్ తయారీ డ్రోన్లు ఉపయోగించారన్న సమాచారం మాస్కో ఆగ్రహానికి కారణమైంది. దీంతో రష్యా నేరుగా లండన్నే టార్గెట్ చేసింది. “బ్రిటన్ ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.. దీనికి పరిణామాలు ఉంటాయి” అంటూ హెచ్చరించింది. అయితే ఆ ‘పరిణామాలు’ ఏ రూపంలో ఉంటాయన్నది మాత్రం చెప్పలేదు. దీంతో ఇప్పుడు రష్యా తదుపరి అడుగు ఏంటన్నదే అసలు ఉత్కంఠగా మారింది. అసలు వివాదం ఏంటి? ఇటీవలి వారాల్లో ఉక్రెయిన్ రష్యా భూభాగంపై డ్రోన్ దాడులను మరింత పెంచింది. మాస్కోతో పాటు పలు ప్రాంతాల్లో చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను కీవ్ టార్గెట్ చేసింది. రష్యాకు చెందిన ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్కు సంబంధించిన కొన్ని గిడ్డంగులు కూడా దాడుల పరిధిలోకి వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఉపయోగించిన కొన్ని డ్రోన్లు బ్రిటన్లో తయారైనవేనన్న సమాచారం బయటకు రావడంతో వివాదం మొదలైంది. అయితే బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ డ్రోన్లను రష్యాపై దాడులకు ఉపయోగించారన్న నిర్దిష్ట నివేదికలను ధృవీకరించలేదు. రష్యా హెచ్చరిక.. లండన్లోని రష్యా రాయబార కార్యాలయం బ్రిటన్పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఉద్దేశపూర్వకంగా మరింత తీవ్రతరం చేసే మార్గాన్ని లండన్ ఎంచుకుందని మండిపడింది. ఉక్రెయిన్కు ఆయుధాలు, డ్రోన్లు, ఇతర సైనిక సహాయం అందించడం ద్వారా రష్యాతో ఘర్షణలో బ్రిటన్ మరింత లోతుగా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. అంతేకాదు.. బ్రిటన్ “పరిణామాలను” ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే అవి ఎలాంటి చర్యలుగా ఉంటాయో మాత్రం మాస్కో వెల్లడించలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ కూడా బ్రిటన్ సైనిక సహాయంపై తీవ్ర విమర్శలు చేశారు. పాశ్చాత్య దేశాల మద్దతు పెరిగే కొద్దీ.. యుద్ధంలో వాటి ప్రమేయం కూడా పెరుగుతోందని రష్యా