
Sircilla: రాజన్న దర్శనంలో జాప్యం వద్దు కలెక్టర్కు బీజేపీ డిమాండ్! Sircilla: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో గత 9 నెలలుగా భక్తులకు స్వామివారి దర్శనాన్ని పరిమితం చేయడం లేదా నిలిపివేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. శ్రావణమాసంలోనైనా భక్తులందరికీ రాజన్న దర్శన భాగ్యం కల్పించాలని కోరుతూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ గత 9 నెలలుగా రాజన్న దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇకపై మరింత జాప్యం చేయకుండా శ్రావణమాసంలోనే శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు. ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ భక్తుల ఆధ్యాత్మిక భావోద్వేగాలు, విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని దర్శనానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అభివృద్ధి పనులకు భక్తులు పూర్తిగా సహకరిస్తారని, అయితే అభివృద్ధి పేరుతో భక్తుల ఆధ్యాత్మిక హక్కులు, మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు తక్షణ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. శ్రావణమాసం అత్యంత పవిత్రమైన మాసమని, ఈ సమయంలో రాజన్నను దర్శించుకోవాలని లక్షలాది మంది భక్తులు కోరుకుంటారని గోపి పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవించి వెంటనే దర్శన ఏర్పాట్లు కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేశారు