
‘‘జూన్ 30, 2026 నాటికి మొత్తం 3,718 మొబైల్ అప్లికేషన్లను దేశంలో నిషేధించాం. అనుమానాస్పద, నేరపూరిత కార్యకలాపాల్లో పోలీసులు గుర్తించిన 15.75లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5,77లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేశాం. సైబర్ నేరాల కట్టడి కోసం ఏర్పాటు చేసిన ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS)’కు అందిన 32.80లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించి రూ.11,158 కోట్లను నేరగాళ్ల చేతికి వెళ్లకుండా కాపాడాం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. చోరీ చేసిన డబ్బును తరలించేందుకు సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తోన్న మ్యూల్ ఖాతాలపైనా చర్యలు ముమ్మరం చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి 32.08 లక్షల అనుమానిత మ్యూల్ బ్యాంకు ఖాతాలను గుర్తించి, రూ.25,698 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలను అడ్డుకున్నామని పేర్కొంది. పలు ప్రభుత్వ ఏజెన్సీలు, సాంకేతిక సంస్థల సహకారంతో ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రి వివరించారు. ఆర్థిక మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, నకిలీ వెబ్సైట్లు, యాప్లతో దోపిడీలు, సోషల్ మీడియా నేరాల వంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కేంద్రం ఈ సందర్భంగా మరోసారి వెల్లడించింది. 1930 హెల్ప్లైన్ నంబరుతోనూ పౌరులు ఈ సైబర్ మోసాల గురించి రిపోర్ట్ చేయొచ్చని తెలిపింది. ఇక, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్లు, టీవీ, రేడియో యాడ్స్, డిజిటల్ మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు సందేశాలు పంపిస్తున్నట్లు పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల