
‘‘పెళ్లైన కొత్తలో మా బావకు మరాఠీ రాదనుకున్నాం. అందుకే ఆయన ముందే రహస్యంగా మరాఠీలో మాట్లాడుకునేవాళ్లం. కానీ ఏళ్ల తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యాం’’ అంటూ స్టార్ హీరో మరదలు నటి శిల్పా శిరోద్కర్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తాను, తన సోదరి నమ్రత శిరోద్కర్ మాట్లాడే విషయాలను మహేశ్బాబు నిశ్శబ్దంగా వినేవారని సరదాగా చెప్పింది.‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ 5’ షోలో పాల్గొన్న శిల్పా కుటుంబంలో జరిగిన ఈ సరదా సంఘటనను గుర్తు చేసుకుంది. నమ్రతకు పెళ్లైన కొత్తలో మహేశ్బాబుకు మరాఠీ తెలియదని తామిద్దరం భావించామని చెప్పింది. అందుకే ఆయనకు అర్థం కాకూడదనుకున్న విషయాలన్నీ మరాఠీలోనే మాట్లాడుకునేవాళ్లమని వెల్లడించింది. అయితే ఒకరోజు తాము మాట్లాడుకుంటుండగా మహేశ్బాబు అకస్మాత్తుగా మరాఠీలోనే స్పందించడంతో ఇద్దరం అవాక్కయ్యామని తెలిపింది.తర్వాత తనకు మరాఠీ బాగా అర్థమవుతుందని మహేశ్బాబు చెప్పారని శిల్పా వెల్లడించింది. ఇన్నాళ్లూ తమ మాటలన్నీ వింటూనే ఆ విషయం దాచిపెట్టారని నవ్వుతూ చెప్పింది. అదృష్టవశాత్తూ ఆయన గురించి చెడుగా ఏమీ మాట్లాడలేదని, లేకపోతే ఇద్దరూ చిక్కుల్లో పడేవాళ్లమని సరదాగా వ్యాఖ్యానించింది. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ శిల్పా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి