
జూలూరుపాడు, ఆగస్టు 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వర్షాధార సాగు భూములకు ప్రాణాధారమైన సీతారామ ఎత్తిపోతల పథకం నీళ్లను ముందుగా స్థానిక భూ నిర్వాసితులకే మళ్లించాలని, స్థానిక అవసరాలు తీర్చకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేష్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో శనివారం జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గోదావరి జలాలు తమ పొలాలకు మళ్లుతాయనే ఆశతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి తమ విలువైన భూములను త్యాగం చేశారన్నారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా గత రెండు నెలలుగా ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించకుండా నాగార్జునసాగర్ కాలువల్లోకి జలాలను తరలించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి ఎద్దడి ఉన్న స్థానిక ప్రాంతాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించిన తర్వాతే మిగులు జలాలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులపై నిజమైన ప్రేమ ఉంటే, తక్షణమే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు భూసేకరణ కింద నిర్వాసితులైన రైతులకు ఎకరానికి రూ.21 లక్షల చొప్పున నిధులు కేటాయించి చెల్లించాలని, సాగునీరు అందక నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అవకాశం ఉన్న ప్రతి చెరువుకూ సీతారామ జలాలను తక్షణమే విడుదల చేయాలని, రాబోయే రబీ సీజన్ నాటికి జిల్లాలోని ప్రతి వ్యవసాయ భూమికీ సాగునీరు అందేలా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఎరువుల సబ్సిడీ రూపంలో లక్షల కోట్లు భరిస్తూ ఒక్కో బస్తాపై సుమారు రూ.2,000 వరకు వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు