
Badradri: బ్రతికుండగానే ఒక వ్యక్తిని కాగితాల్లో చంపేసి, అతని కోట్లాది రూపాయల భూమిని కాజేయాలని చూసిన షాకింగ్ ఘటన భద్రాద్రి (Badradri)కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెనికి చెందిన మళ్ల సత్యం అనే వృద్ధుడిని మరణించినట్లు సృష్టించి, అతని ఐదెకరాల ఎసైన్డ్ భూమిని దౌర్జన్యంగా వేరొకరి పేరు మీదకు మార్చేశారు. ఈ భూమాఫియా నిర్వాకం సత్యం తన భూమిని అమ్ముకోవాలని ప్రయత్నించినప్పుడు బయటపడటంతో స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. DSP Bheem Reddy: డీఎస్పీ భీమ్రెడ్డి వెనుక ప్రముఖ హీరో.. డైరీలో సంచలన వివరాలు.. ఇంతకీ ఎవరా హీరో? మళ్ల సత్యానికి పెద్దగొల్లగూడెంలో 1/70 చట్టం పరిధిలో ఉన్న ఐదెకరాల విలువైన భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన మందలపల్లికి చెందిన నామా సత్యనారాయణ అనే వ్యక్తి, స్థానిక జీపీవో అనంతలక్ష్మితో చేతులు కలిపాడు. సత్యం కుటుంబ పరిస్థితులను ఆసరాగా చేసుకుని, అతను 2018లోనే చనిపోయినట్లు ఒక నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. అంతటితో ఆగకుండా, సత్యనారాయణ తన భార్య పుష్పవతిని సత్యానికి ఏకైక కుమార్తెగా చూపిస్తూ రెవెన్యూ కార్యాలయం నుంచి నకిలీ కుటుంబ ధ్రువపత్రాన్ని కూడా పొందాడు. దీని ఆధారంగా తహసీల్దార్ రాంనరేశ్ మే 26న ఆ భూమిని పుష్పవతి పేరిట వారసత్వ బదిలీ చేసేశారు. ఈ మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు మళ్ల సత్యం, తాను బ్రతికే ఉన్నానంటూ దమ్మపేట రెవెన్యూ కార్యాలయానికి వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దార్ రాంనరేశ్ స్పందిస్తూ… జీపీవో అనంతలక్ష్మి తమ సంతకాలను ఫోర్జరీ చేసి ఈ నకిలీ పత్రాలను సృష్టించిందని, అందుకే పొరపాటున భూ బదలాయింపు జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ అక్రమ భూ బదలాయింపును వెంటనే రద్దు చేస్తామని, సంతకాలు ఫోర్జరీ చేసిన జీపీవోపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, బాధితుడు న్యాయం కోసం త్వరలోనే జిల్లా కలెక్టర్ను ఆశ్రయించనున్నట్లు తెలిపారు