
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రగిలిపోతోంది. పాకిస్థాన్ అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. పాకిస్థాన్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేతృత్వంలో ఈ నెల 3న మొదలైన ఆందోళన, నిరసన ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. ముజఫరాబాద్, రావలకోట్, మీర్పూర్, దాద్యాల్, దేరకోట్ వంటి ప్రధాన నగరాలు అట్టుడుకుతున్నాయి. తమను బానిసలుగా చూస్తున్న పాక్ ప్రభుత్వంపై జనం ఒకరకంగా తిరుగుబాటు చేశారు. అయితే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిషేధం విధించింది. ఆ సంస్థ నాయకులు, శ్రేణుల కోసం పీవోకే వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేట మొదలెట్టింది. ఇప్పటికే.. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ లీడర్ షౌకత్ నవాజ్ మీర్తో పాటు 600 మందికి పైగా సామాజిక కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేసింది. ఇక పీవోకే సమాచారం, ఆందోళనల వార్తలు బయటకు తెలియకుండా.. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. పీఓకేలోని ప్రధాన పట్టణాలకు ఆహారం, పిండి, అత్యవసర మందుల సరఫరా నిలిపేసి.. ఆర్థిక దిగ్బంధాన్ని విధించారని స్థానిక నిరసనకారులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆకలితో అలమటించేలా చేసి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్న పాక్ పాలకుల ఎత్తుగడలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. గతంలో కుదిరిన 38 అంశాల లిఖితపూర్వక ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని, అరెస్టయిన