
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ మేరకు 'ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026'ను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. నిబంధనలను సరళతరం చేసి, ఉన్నత విద్యా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిగా తీసుకొచ్చిన 'జన్ విశ్వాస్' విధానంలో భాగంగానే ఈ సవరణలు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అన్ని రంగాలకు విస్తరింపజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఉన్నత విద్యా రంగంలో నియంత్రణలను సులభతరం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వర్సిటీల సంఖ్య తక్కువగా ఉందని, ఈ సవరణల ద్వారా కొత్త సంస్థలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.ఈ బిల్లులో పలు కీలక సవరణలు ప్రతిపాదించారు. ప్రధానంగా, ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని 50 ఎకరాల నుంచి సీఆర్డీఏ, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో 10 ఎకరాలకు, ఇతర ప్రాంతాల్లో 15 ఎకరాలకు తగ్గించారు. కనీస పెట్టుబడి నిబంధనను పూర్తిగా తొలగించి, కేసును బట్టి నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకునేలా మార్పు చేశారు. ఎండోమెంట్ ఫీజును రూ.5 కోట్లకు పరిమితం చేశారు. బ్రౌన్ఫీల్డ్ వర్సిటీగా మారాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం కనీసం 3.01 సీజీపీఏ తప్పనిసరి చేశారు.ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో రెండో మహిళా విశ్వవిద్యాలయంగా 'విష్ణు మహిళా విశ్వవిద్యాలయం' ఏర్పాటుకు మార్గం సుగమమైందని మంత్రి తెలిపారు