
ఇంటర్నెట్డెస్క్: పౌరసత్వాన్ని ధ్రువీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. అస్సాంలో విదేశీయులుగా ముద్రపడిన 27 మంది పౌరులకు రక్షణ కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీహోదా అనేవి రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయి అని తేల్చిచెప్పింది. అలాగే గువాహటి హైకోర్టు, ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను పక్కన పెట్టింది. పాత ఓటర్ల జాబితాలో టైపింగ్ తప్పిదాలు, స్పెల్లింగ్లోని చిన్నచిన్న వ్యత్యాసాలను సాకుగా చూపి, తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అస్సాంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో వారికి ఊరట లభించింది. అయితే వారి పౌరసత్వాన్ని ధ్రువీకరించే ఆధారాలను తాము పరిశీలించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. ట్రైబ్యునళ్లు మరోసారి విచారణ జరిపే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండకూడదని ఆదేశాలు ఇచ్చింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు