
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు మేలు చేకూర్చే పలు కీలక నిర్ణయాలకు ఈ భేటీలో ఆమోదముద్ర వేయనున్నారు.భూ సమీకరణ పథకం కింద కొత్తగా భూములిచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీని అందించే ప్రతిపాదనకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. ఇందులో భాగంగా మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేలు, జరీబు భూములకు రూ.60 వేల చొప్పున వార్షిక కౌలును చెల్లించనున్నారు. అలాగే, ట్రంక్ రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున అద్దె చెల్లించే అంశాన్ని కూడా ఆమోదించనున్నారు.వీటితో పాటు కొత్త పూలింగ్ గ్రామాల్లోని రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనామ్, దేవాదాయ భూముల బదలాయింపుతో పాటు, సంబంధిత శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లింపు వంటి అంశాలు ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయి.మత్స్యశాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక అక్వేరియం నిర్మాణం, ఆర్ట్ ఆఫ్ లివింగ్కు 7.42 ఎకరాల కేటాయింపు, ఈశా ఫౌండేషన్కు పార్కు నిర్వహణ బాధ్యతలు, సీఐఐకు నాలుగు ఎకరాల భూకేటాయింపులపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన 11 ప్రాజెక్టుల ద్వారా రూ.9,076 కోట్ల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి