
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. ‘‘వైబ్రంట్ సివిల్ డిఫెన్స్ నెట్వర్క్’’తో పాటు ‘‘భారీ, ఆధునిక పౌర రక్షణ స్వచ్ఛంద సేవకుల దళాన్ని’’ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆధునిక భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు పౌరులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్తో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులను రంగంలోకి దింపి దేశవ్యాప్తంగా కృత్రిమ విన్యాసాలు నిర్వహించారు. అసలు ఈ దళం అంటే ఏమిటి? జాతీయ భద్రత కోసం పౌర స్వచ్ఛంద సేవకుల దళాన్ని భారత్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారా? ఈ ప్రతిపాదిత దళం భారత్లో తొలి పౌర స్వచ్ఛంద సంస్థ కాదు. వాస్తవానికి 1968 సివిల్ డిఫెన్స్ చట్టం కింద భారత్లో ఇప్పటికే చట్టబద్ధమైన సివిల్ డిఫెన్స్ దళం ఉంది. సివిల్ డిఫెన్స్ దళాల ఏర్పాటు, శిక్షణ లేదా సివిల్ డిఫెన్స్ విధులకు పిలిచే పౌర స్వచ్ఛంద సేవకుల నియామకానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. 1968 సివిల్ డిఫెన్స్ నిబంధనల్లో ప్రజలను తరలించడం, కీలక మౌలిక వసతులకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాల నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడం, శత్రు దాడుల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు వంటి చర్యలు ఉన్నాయి. అందువల్ల సివిల్ డిఫెన్స్ అంటే యుద్ధ సమయంలో పోరాటానికి మాత్రమే పరిమితం కాదు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులు, కీలక సేవలను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. స్వచ్ఛంద సేవకులు ఏం చేయవచ్చు? సాంప్రదాయ సివిల్ డిఫెన్స్ విధుల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సహాయపడటం, కీలక సేవలకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం, అత్యవసర సూచనలను ప్రజలకు చేరవేయడం ఉన్నాయి. ఆధునికీకరించిన వ్యవస్థలో ప్రథమ చికిత్స, గాలింపు, రక్షణ చర్యలు, అత్యవసర సమాచార వ్యవస్థలు, ప్రజల తరలింపు నిర్వహణ, ఆశ్రయ కేంద్రాల నిర్వహణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు