
Nara Lokesh: ఉద్యోగాల పేరుతో మోసపోయి థాయ్లాండ్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఐదుగురు తెలుగు విద్యార్థుల ఉదంతం తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. సైబర్ ముఠాలు తమను బలవంతంగా మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయని, తమను కాపాడాలంటూ బాధిత యువకులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తక్షణమే స్పందించారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకున్న ఆయన, వారిని సురక్షితంగా మాతృభూమికి చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి తగిన చర్యలకు ఆదేశించారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఏపీ భవన్ అధికారులు రెస్క్యూ ప్రక్రియను వేగవంతం చేశారు. థాయ్లాండ్లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అధికారులతో మాట్లాడిన ఏపీ భవన్ కమిషనర్, విద్యార్థులను సాధ్యమైనంత త్వరగా భారత్కు పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ప్రయాణానికి, క్లియరెన్స్కు కావలసిన అన్ని రకాల అత్యవసర పత్రాలను, అధికారిక మద్దతును ఏపీ ప్రభుత్వమే స్వయంగా అందిస్తుందని కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించారు. బాధితులు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న వీడియో సందేశం వైరల్ కావడంతో ప్రభుత్వం వేగంగా స్పందించడం గమనార్హం. “మీ ఆందోళన నాకు అర్థమైంది, క్షేమంగా మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తాం” అని మంత్రి లోకేశ్ స్వయంగా ట్వీట్ చేసి వారిలో ధైర్యం నింపారు. ప్రస్తుతం అధికారుల సమన్వయంతో డాక్యుమెంటేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో, ఆ ఐదుగురు తెలుగు యువకులు త్వరలోనే సురక్షితంగా స్వదేశానికి చేరుకోనుండటంతో వారి కుటుంబ సభ్యులు ఉపశమనం వ్యక్తం చేస్తున్నారు