
వన్యప్రాణుల కదలికల గుర్తింపు, భక్తుల భద్రతే లక్ష్యం రోబో డాగ్ పనితీరును పరిశీలిస్తున్న తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి, చిత్రంలో సీవీఎస్వో మురళీకృష్ణ, డీఎఫ్వో ఫణికుమార్నాయుడు, సీపీఆర్వో డాక్టర్ టి.రవి తదితరులు ఈనాడు డిజిటల్, తిరుపతి; తిరుమల, న్యూస్టుడే: తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పసిగట్టేందుకు, భక్తులకు మరింత పటిష్ఠ భద్రత కల్పించేందుకు తితిదే రోబోలను రంగంలోకి దించుతోంది. మనుషులు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండే కొండకోనల్లో సునాయాసంగా తిరుగుతూ, రియల్ టైమ్ నిఘా ఉంచే ‘క్వాడ్రుపెడ్ రోబోట్’ (నాలుగు కాళ్ల రోబో డాగ్)ను ప్రయోగాత్మకంగా వినియోగించాలని నిర్ణయించింది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద ఈ ఆధునిక రోబో పనితీరును తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. రోబో పనితీరు అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ దీన్ని రూపొందించింది. రోబో డాగ్ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. కారుచీకటి, దట్టమైన పొగమంచు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించగలదు. మెట్లు, రాళ్లు ఉన్న దారుల్లో సైతం ఎలాంటి ఆటంకం లేకుండా ఇది సులభంగా పయనించగలదు. ముఖ్యంగా అలిపిరి-తిరుమల నడక మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ఈ రోబో ముందుగానే గుర్తిస్తుంది. భక్తులు రాకపోకలు సాగించే ప్రాంతం వైపు జంతువులు వస్తే.. వెంటనే ఇది కంట్రోల్ రూమ్కు, పెట్రోలింగ్ సిబ్బందికి జియో-ట్యాగ్తో కూడిన అలర్ట్, లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్ పంపుతుంది. ఇందులో ఉండే సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి జంతువులను తాకకుండానే తిరిగి అడవిలోకి మళ్లించే వీలుంటుంది. రోబో డాగ్ విలువ ఒక్కొక్కటి రూ.20-25 లక్షల వరకు ఉంటుంది. ‘ప్రస్తుతం ఒక రోబోను తీసుకువచ్చి 20 రోజులపాటు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం. వచ్చేనెలలో జరగనున్న బ్రహ్మోత్సవాల సమయంలో దీన్ని అటవీ ప్రాంతంలో వినియోగించబోతున్నాం’ అని తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి అన్నారు. గమనిక