
Pullela Gayatri | ఇంటర్నెట్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్లో రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది పుల్లెల గాయత్రి (Pullela Gayatri). ట్రీసా జాలీ జంటగా అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా రాణిస్తోంది. గాయత్రి నిలకడగా మంచి ప్రదర్శనలు చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆమెను తాజాగా అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గాయత్రి కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను ఓసారి పరిశీలిస్తే.. గాయత్రి బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) కుమార్తె అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ బ్యాడ్మింటన్లో దూసుకుపోతోంది. ట్రీసా జాలీతో కలిసి ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2022లో మహిళల డబుల్స్ సెమీ ఫైనల్కు చేరడంతో గాయత్రి బ్యాడ్మింటన్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అప్పట్నుంచి వరుస విజయాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో చిన్నప్పటి నుంచే ఆటపై ఆసక్తిని పెంచుకుంది. గోపీచంద్ అకాడమీలో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధులను గమనించి వారితో కలిసి శిక్షణ పొంది తన నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకుంది. అప్పటివరకు ప్రధానంగా సింగిల్స్ క్రీడాకారిణిగా ఉన్న గాయత్రి.. తండ్రి గోపీచంద్, కోచ్ అరుణ్ విష్ణు ప్రోత్సాహంతో డబుల్స్ విభాగంలోనూ ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో గోపీచంద్ అకాడమీలో ట్రీసా జాలీ రూపంలో గాయత్రికి సరైన జోడీ దొరికింది. ఈ జంట 2021లో ‘ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్’లో స్వర్ణ పతకాన్ని సాధించగా.. ఆ తర్వాత వెల్ష్ ఇంటర్నేషనల్లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 2022లో గాయత్రి, ట్రీసా జాలీ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ఫైనల్కు చేరడంతో పాటు ఒడిశా ఓపెన్లో తమ తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఈ జోడీ వరుసగా రెండుసార్లు (2024, 2025) సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ను సాధించింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎన్నో అద్భుత విజయాలు సాధించి దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందారు