
తాడ్బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మెగా జంట వరుణ్ తేజ్(VarunTej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) జంట బుధవారం హైదరాబాద్లోని తాడ్బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని (Shree Tadbund Veeranjaneya Swami Temple) సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ నరేందర్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలను సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ దంపతులు మాట్లాడుతూ.. ఎంతో మహిమగల వీరాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాగా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని చూసేందుకు ఆలయం వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన హీరోహీరోయిన్లతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడంతో అక్కడ సందడి నెలకొంది