
ఇంటర్నెట్ డెస్క్: శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో సుస్థిరత నెలకొంటుందని ఆశ పడేలోపే.. మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్ (Israel) నిఘా వర్గాలు అగ్రరాజ్యానికి కీలక హెచ్చరికలు చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)ను హత్య చేసేందుకు ఇరాన్ (Iran) కొత్త కుట్రలు చేస్తున్నట్లు హెచ్చరించాయి. దీంతో పశ్చిమాసియాపై మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా సంస్థలకు కొన్ని వారాలుగా సమాచారం అందుతూనే ఉంది. కానీ, దీని గురించి ఇజ్రాయెల్ అలర్ట్ (Israel Alert to Trump) చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. ట్రంప్ హత్యకు ఇరాన్ ఓ నిర్దిష్ట ప్రణాళికను రూపొందించినట్లు తమకు సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది. ఇరాన్లో ఖమేనీ అంతిమయాత్ర జరిగిన సమయంలో నెతన్యాహు సర్కారు.. ఈ సమాచారాన్ని అమెరికాకు అందజేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ కుట్రకు సంబంధించి ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. హర్మూజ్లో నౌకలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా తాజా దాడులు చేపట్టింది. దీంతో టెహ్రాన్ కూడా విరుచుకుపడటంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. అయితే, ఈ దాడులను మరింత తీవ్రతరం చేయాలా? లేక ఇరాన్తో కాల్పుల విరమణను కొనసాగించాలా? అనే దానిపై ప్రస్తుతం ట్రంప్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో ఇజ్రాయెల్ నుంచి నిఘా అలర్ట్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ హెచ్చరికలు ట్రంప్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కొందరు అమెరికా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, తనపై హత్య కుట్రల గురించి ట్రంప్ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తుర్కియేలో నాటో సదస్సు సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అమెరికా అధ్యక్షుడిని అడ్డు తొలగించాలని వారు (ఇరాన్ను ఉద్దేశిస్తూ) కోరుకుంటున్నారు. నేను అందరి హిట్ లిస్ట్లో ఉన్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఈ