
మృతదేహాన్ని ముక్కలుగా నరికి నదిలో విసిరివేత మూడేళ్ల తర్వాత బయటపడిన ఘటన చెన్నై(ట్రిప్లికేన్), న్యూస్టుడే: కుమారుడి ద్వారా తనకు ప్రమాదం ఉందని జ్యోతిష్కుడు చెప్పడంతో ఓ తండ్రి కన్నబిడ్డను చంపి నదిలో పడేసిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తేని నగరంలోని ఎంజీఆర్నగర్ చెందిన వేందర్ బాలా(50) తమిళగ మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ తరఫున పనిచేస్తున్నారు. అతని మొదటి భార్య రాజలక్ష్మి కుమారుడు శ్రీకాంత్(20) ఆస్తి విషయంలో తండ్రితో గొడవపడేవాడు. 2023 సెప్టెంబం్లో శ్రీకాంత్ అదృశ్యమయ్యాడని తల్లి రాజలక్ష్మి మదురై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో 2026 ఫిబ్రవరిలో కేసు దర్యాప్తు సీబీసీఐడీకి బదిలీ అయింది. దర్యాప్తులో.. శ్రీకాంత్కు, తేనికి చెందిన అలెక్స్పాండియన్ అనే వ్యక్తికి మధ్య పాతకక్షలు ఉన్నట్లు తెలిసింది. పోలీసులు అలెక్స్పాండియన్ను అరెస్టు చేసి విచారించారు. అతను, వేందర్ బాలా, ముల్లైనగర్కు చెందిన కరుప్పయ్య కలిసి శ్రీకాంత్ని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ముల్లైపెరియార్ నదిలో పడేసినట్లు చెప్పాడు. బుధవారం వేందర్ బాలాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. ఓ జ్యోతిష్కుడి వద్ద జాతకం చూపించగా కుమారుడితో తనకు ప్రమాదం ఉందని చెప్పాడని, స్నేహితుడు కరుప్పయ్య సాయంతో శ్రీకాంత్ని గొంతు నులిమి హత్యచేసినట్లు అంగీకరించాడు. కరుప్పయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు