
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర జనాభా విధానంపై ఒక సంచలనాత్మక, కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వాలు అనుసరించిన 'జనాభా నియంత్రణ' విధానానికి స్వస్తి పలికి, 'జనాభా సంరక్షణ' అనే కొత్త దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. "జనంతోనే అభివృద్ధి, జనాభా ఉంటేనే భవిష్యత్తు" అనే నినాదాన్ని ఇస్తూ, భవిష్యత్తులో 'పిల్లలే సంపద' అనే మాటను నిజం చేసి చూపిస్తామని ఆయన ప్రకటించారు. విజయవాడలో నేడు (జులై 11) జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.గతంలో ప్రభుత్వాలు జనాభా నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాయని, అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించే నిబంధనలు కూడా తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆ విధానాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. "దేశమంటే మట్టి కాదోయ్-దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన మాటల్ని మరోసారి గుర్తు చేసుకోవాలి. జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపడుతుంది. గతంలో మహిళల్లో అక్షరాస్యత పెరిగితే జనాభా నియంత్రణ సాధ్యమని భావించాం. 'ఒక్కరు ముద్దు, ఇద్దరితో సరి' వంటి ప్రచారాలు చేశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఫెర్టిలిటీ రేటు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి వివరించారు.ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో జనాభా తగ్గిపోతోందని, భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు