
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనలు చేపట్టిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఉన్నారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.జగన్ పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పటికీ, వైసీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా భారీ ర్యాలీలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఈ నిబంధనల అతిక్రమణపై స్పందించిన పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అలాగే, పర్యటనలో భాగంగా దిష్టిబొమ్మను దహనం చేసిన వైసీపీ నేత సుభాష్ చంద్రబోస్ సహా ఆయన అనుచరులపై కూడా కేసు నమోదైంది.వీటితో పాటు, "గంగమ్మ జాతర" ప్లకార్డులను ప్రదర్శించిన కొందరు కార్యకర్తలను కూడా ఈ కేసుల్లో చేర్చారు. పర్యటనకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన మరికొంత మందిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి