
తిరుపతి తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా.. అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన పలు కీలక అంశాలపై జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించేందుకు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చారు. వీరందరికీ చంద్రగిరి వైసీపీ ఇన్ చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వహించారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఎస్పీ కార్యాలయానికి తరలి వచ్చి ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పిస్తామని కోరారు. అయితు.. పోలీసులు నిబంధనల మేరకు ఎస్పీని కలిసేందుకు ఐదుగురు ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఇందుకు ఒప్పుకోని వైసీపీ శ్రేణులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అది ముదిరి తోపులాటకు దారి తీసింది. పరిస్థితి శ్రుతి మించుతుండటంతో.. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై పోలీసులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులను అడ్డుకోవడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా చంద్రగిరి వైసీపీ కీలక నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చంద్రమౌళిరెడ్డి, చెవిరెడ్డి రఘు సహా ప మరో 30 మంది వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి