
తెలుగు సినిమా చరిత్రను 'మల్లీశ్వరి ముందు.. మల్లీశ్వరి తర్వాత' అని విభజించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1951లో విడుదలైన ఈ అద్భుత కావ్యం.. కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, వెండితెరపై ఆవిష్కృతమైన ఒక స్వచ్ఛమైన కావ్య రసగుళిక. విజయా పిక్చర్స్ పతాకంపై నాగిరెడ్డి-చక్రపాణిల నిర్మాణ సారథ్యంలో, దర్శక రత్న బి.ఎన్. రెడ్డి మలచిన ఈ సినిమా ఎందరో దర్శకులకు, కళాకారులకు ఇప్పటికీ ఒక మార్గదర్శిగా నిలిచిపోతుంది. సీనియర్ ఎన్.టి.రామారావు, భానుమతిల అద్భుతమైన అభినయం, డి.వి. నరసరాజు కథనం, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వరరావు సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో జరిగే ఒక అందమైన ప్రేమకథే 'మల్లీశ్వరి'. కాకాని గ్రామానికి చెందిన నాగరాజు (ఎన్.టి.ఆర్), మల్లీశ్వరి (భానుమతి) చిన్ననాటి నుండి ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరుగుతారు. బావమరదళ్లైన వీరిద్దరి నడుమ చిగురించిన అనురాగం, పెరిగి పెద్దదయ్యాక గాఢమైన ప్రేమగా మారుతుంది. అయితే, మల్లీశ్వరి మేనత్త నాగమ్మ(ఋష్యేంద్రమణి) ఆమెకు రాజ్యసభలో 'రాజకన్య' హోదా లభిస్తే వచ్చే సంపదపై ఆశపడుతుంది. అనుకోని పరిస్థితుల్లో రాయలవారి ఆస్థానానికి చెందిన అధికారులు మల్లీశ్వరిని విజయనగర రాజప్రసాదానికి 'రాజకన్య'గా ఎంపిక చేసి తీసుకెళ్తారు. ఆనాటి నిబంధనల ప్రకారం రాజకన్యగా ఎంపికైన స్త్రీ ఎవరినీ ప్రేమించకూడదు, వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ఆ నిబంధన మీరితే మరణశిక్ష విధించబడుతుంది. తన మల్లీశ్వరిని దూరమైన నాగరాజు ఆమెను వెతుక్కుంటూ విజయనగరం చేరుకుంటాడు. శిల్పిగా మారి రాజప్రసాదంలోకి అడుగుపెడతాడు. అక్కడ వారిద్దరూ కలుసుకున్నారా? వారి ప్రేమ ఫలించిందా? శ్రీకృష్ణదేవరాయలు వారి ప్రేమను గుర్తించి ఏం చేశారు? అనేదే మిగిలిన కథ. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో వచ్చిన అతిముఖ్యమైన చిత్రాల్లో మల్లీశ్వరి ఒకటి. అమాయకత్వం, ప్రేమ, విరహం, ఆవేదనల సమ్మేళనంగా నాగరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. ముఖ్యంగా భానుమతితో పోటీపడి నటించారు. ఆమెకంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైనా.. ప్రేమ సన్నీవేశాలు, ఆర్ స్క్రీన్ రొమాన్స్