
బెల్జియంలోని ఈస్ట్ ఫ్లాండర్స్ పరిధిలోని సెంట్ గిలిస్ డెండర్మోండే అనే ప్రాంతంలో ఒక పాత భవనంలో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అక్కడ సీవేజ్ పైపులు వేసేందుకు మట్టిని తవ్వుతున్నారు. ఆ భవనం పునాదులను డ్రిల్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడల నుంచి ఏదో పసుపు రంగు వస్తువు మెరుస్తూ బయటపడింది. రోజూలాగే పనులు చేస్తుండగా ఈ దృశ్యం చూసి అక్కడున్న కార్మికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో పార్ట్ టైమ్ వర్క్ కోసం వచ్చిన 18 ఏళ్ల విద్యార్థి కోబే, సైట్ మేనేజర్ వారియో పనుల్లో ఉన్నారు. మొదట నేలపై మెరుస్తున్నవి చూసి వారు సాధారణ 1 యూరో నాణాలు అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్లి మట్టిని తొలగించి చూసేసరికి వారి మైండ్ బ్లాక్ అయింది. అవి సాధారణ నాణాలు కావు, బంగారు నాణాలు, బంగారు బిస్కెట్లు. సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే భారతీయ కరెన్సీలో రూ.85 కోట్ల నుంచి రూ.100 కోట్ల విలువైన బంగారం అక్కడ లభించింది. 33 ఏళ్లుగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న సైట్ మేనేజర్ వారియో, తన జీవితంలో ఇంతటి ఆశ్చర్యకరమైన విషయాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అంత పెద్ద మొత్తంలో బంగారం లభించినప్పటికీ, కార్మికులు దానిని దాచుకునే ప్రయత్నం చేయలేదు. దానిని దాచడం చట్టరీత్యా నేరం అని, దొంగతనంతో సమానమని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్వాధీనం చేసుకున్న ఆ నిధిని అధికారులు సురక్షితమైన ప్రభుత్వ ఖజానాకు తరలించారు. ఈ వార్త తెలియగానే ఆ ప్రాంతానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇంకేమైనా బంగారం దొరుకుతుందేమో అని జనాలు తవ్వకాలు జరపడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. ఈ బంగారం ఎక్కడిది అనే దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. 19వ శతాబ్దంలో అక్కడ నడిచిన ఒక పాత బీర్ ఫ్యాక్టరీ యజమాని థియోఫిలస్ వాన్ ఆషే కుటుంబానికి ఇది చెంది ఉండవచ్చని భావిస్తున్నారు