
అమరావతి: దేవాలయం లాంటి అసెంబ్లీని ఓ పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలోనే చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు (chandrababu) విమర్శించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం చంద్రబాబు.. తాజా పరిణామాలపై కొద్దిసేపు ముచ్చటించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే వాటికి విలువ, గుర్తింపు ఉంటుందని.. బయట కూర్చొని ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నత వేదిక అని తెలిపారు. 1978లో వెంకయ్యనాయుడు, జైపాల్రెడ్డి ఇద్దరే సభలో గట్టిగా మాట్లాడారని గుర్తు చేశారు. 1989-94లో ఎన్టీఆర్ కొన్ని రోజులు సభకు రాకపోయినా తామంతా పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడామని వివరించారు. 2019-24 మధ్య తాను సభలో సవాల్ చేసి బయటకు వచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే ‘గొడ్డలి పార్టీ’ నాయకుడికి రాజకీయాలు అవసరమా? అని చంద్రబాబు నిలదీశారు. గ్రూప్-1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా బయట కూర్చొని డీఎస్సీపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి ప్రభుత్వం కోత పెట్టిన బీసీ రిజర్వేషన్లను తామే పునరుద్ధరించామని, ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ నాయకుడు అసత్యాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. అతని మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు