
రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం అంచనాలకు మించి తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని, ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జల వనరుల పరిరక్షణ కోసం చేపట్టిన 'జలధార-జలహారతి' కార్యక్రమాన్ని ఇకపై ఒక నిరంతర కార్యక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా, పంటల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి.. జలధార-జలహారతి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.39 శాతం లోటు వర్షపాతం.. తీవ్ర నీటి సంక్షోభంఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 39 శాతం తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సాధారణంగా 867 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 525 మి.మీ. మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనాలను నివేదించారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో లోటు 56 శాతానికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రిజర్వాయర్లపై స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బేసిన్లలో కలిపి ప్రస్తుతం 563.05 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, గతేడాది ఇదే సమయానికి 825.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉండేదని పోల్చి చెప్పారు. ఆగస్టు నుంచి భూగర్భ జలమట్టాలు కూడా వేగంగా పడిపోయే ప్రమాదం ఉందని