
Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం కేరళకు వెళ్లనున్నారు. 20రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా పవన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత నెలలో భుజానికి సర్జరీ చేయించుకున్న పవన్.. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వరుస అనారోగ్య సమస్యల నేపథ్యంలో కేబినెట్ సమావేశాలతోపాటు పలు కార్యక్రమాలను పవన్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే, కేరళ రాష్ట్రంలోని ప్రకృతి వైద్య చికిత్స కేంద్రానికి పవన్ వెళ్లనున్నారు.. అక్కడే ఇరువై రోజులపాటు ఉండి చికిత్స పొందనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. గురువారం శాసనసభ ప్రాంగణంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభా పక్ష సమావేశం జరిగింది. మున్సిపల్, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పవన్ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన విధివిధానాల రూపకల్పన, క్షేత్ర స్థాయిలోని పార్టీ శ్రేణుల ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీ నియమిస్తామని అన్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్న పవన్ కల్యాణ్ ఎన్నికల సంసిద్ధతపై వారికి దిశానిర్దేశం చేశారు. మరోవైపు… జనసేన పార్టీ సంస్థాగత కమిటీల జాబితాను సమీక్షించిన పవన్ కల్యాణ్.. పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వచ్చిన 36 వేలకు పైగా దరఖాస్తులను, ఆయన స్వీయ పర్యవేక్షణలో పనిచేస్తున్న కమిటీ బృందం పరిశీలించిన అనంతరం సమర్పించిన జాబితాలో అవసరమైన పలు మార్పులు, సవరణలు చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు, జనసైనికుడు, వీరమహిళకు తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం దక్కేలా ఎంపిక ప్రక్రియను మరింత సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించి కమిటీలను ఏర్పాటు చేసేందుకు మరికొద్ది వారాల సమయం తీసుకుని పూర్తిచేయాలని నిర్ణయించారు