
Kajal Aggarwal:మదర్హుడ్ తర్వాత తన సినిమా ఎంపికలో పెద్ద మార్పు వచ్చిందని కాజల్ అగర్వాల్ తెలిపారు. తన కుమారుడు నీల్ గర్వపడేలా ఉండే కథలు, పాత్రలకే ఇకపై ప్రాధాన్యం ఇస్తానని ఆమె వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను చేసే సినిమా నా కొడుకు పెద్దయ్యాక చూసి గర్వపడతాడా? మమ్మా చేసిన గొప్ప సినిమా అని చెప్పుకుంటాడా? అనే కోణంలో ముందుగా ఆలోచిస్తున్నాను అని చెప్పారు. అందుకే ఇకపై కేవలం కమర్షియల్ సినిమాలకే కాదు.. బలమైన కథ, మంచి పాత్ర, భావోద్వేగాలు ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కాజల్ ది ఇండియా స్టోరీ మరియు రామాయణ: పార్ట్ 1 చిత్రాలతో బిజీగా ఉన్నారు. రామాయణ లో ఆమె మండోదరి పాత్రలో నటిస్తుండగా, రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని కాజల్ చెబుతున్నారు. ఎందుకంటే తన కుమారుడు నీల్కు చిన్నప్పటి నుంచే రామాయణం అంటే చాలా ఇష్టమట. ఇంట్లో ప్రతిరోజూ రామలీల చూస్తాడని, తాను రామాయణ సినిమాలో నటిస్తున్నానని చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాడని తెలిపారు. అయితే నీల్కు శ్రీరాముడి పాత్ర కంటే రావణుడి పాత్రే ఎక్కువ ఇష్టమని నవ్వుతూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, రామాయణ: పార్ట్ 2 విడుదలయ్యే సమయానికి నీల్కు ఐదేళ్లు వస్తాయని, థియేటర్లో తన కుమారుడు చూసే మొదటి సినిమా అదే అవుతుందని కాజల్ వెల్లడించారు. తనను మండోదరిగా పెద్ద తెరపై చూసే ఆ క్షణం కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె నటించిన ది ఇండియా స్టోరీ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది