
మాజీ ఎమ్మెల్యే, విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్కు చెందిన వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా రూ.కోట్లు దండుకుంది.... ప్రజల నుంచి అక్రమంగా రూ.2 వేల కోట్లు సేకరణ: ఈడీ కోటి నగదు, 6 లగ్జరీ కార్లు స్వాధీనం.. 182 ఖాతాలు ఫ్రీజ్ విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే, విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్కు చెందిన వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా రూ.కోట్లు దండుకుంది. చట్ట నిబంధనలు ఉల్లంఘించి రూ.రెండు వేల కోట్లు సేకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో వెల్లడైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భారీ స్థాయిలో డిపాజిట్లను సేకరించినట్టు ఈడీ గుర్తించింది. ఈనెల ఐదో తేదీన విశాఖపట్నం, హైదరాబాద్లలో కంపెనీ ఎండీ మళ్ల విజయప్రసాద్, డైరెక్టర్లు వరాహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావు తదితరులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో భువనేశ్వర్ ఈడీ జోనల్ కార్యాలయ అధికారులు సోదాలు జరిపారు. పలు రాష్ర్టాల్లో చిట్ఫండ్ కుంభకోణంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేశారు. సోదాల్లో గుర్తించిన ఉల్లంఘనలు, ఇతర అంశాలను సోమవారం ఈడీ ఓ ప్రకటనలో వివరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) 2002లోని సెక్షన్ 17 కింద ఈ నెల ఐదో తేదీన సోదాలు చేసినట్లు తెలిపింది. ఈ సోదాల్లో రూ.1.01 కోట్ల నగదు, వివిధ స్థిర, చరాస్తులు, నేరపూరిత అంశాలను సూచించే కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, డిజిటిల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. అలాగే 182 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. వారికి సంబంధించి ఆరు లగ్జరీ కార్లు సీజ్ చేసింది. డిపాజిట్ల సేకరణను దాచిపెట్టేందుకు ఆర్థిక నివేదికలను తారుమారు చేసినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తులో ఒడిసా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఏపీ తదితర రాష్ట్రాలకు చెందినవారి నుంచి అనధికారికంగా డిపాజిట్లు సేకరించినట్లు తేలింది