
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఇరాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. తాము అనుకుంటే ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియల సమయంలోనే అక్కడున్న నాయకులందరినీ ఒక్కదెబ్బతో చంపేవాళ్లమని.. కానీ తమతో చర్చలు జరపడానికి ఎవరూ ఉండరనే కారణంతో వారిని వదిలేశామని అన్నారు. ఆ దేశంలోని మిగిలిన నాయకత్వాన్ని నిర్మూలించగలనని.. కానీ అలా చేయాలని తాను అనుకోవట్లేదని పేర్కొన్నారు. ఖమేనీ అంత్యక్రియల్లో (Khamenei's Funeral) వేలాది మంది ఇరానియన్లు కన్నీరు పెట్టుకోవడంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రజలు ఖమేనీని ద్వేషిస్తున్నారని ఇంతకాలం తాను అనుకున్నట్లు తెలిపారు. తాను అనుకున్నదే నిజమై ఉండొచ్చని.. అంత్యక్రియల సమయంలో ప్రజలు మొసలి కన్నీరు కార్చి ఉంటారని అన్నారు. ఇరాన్ విషయంలో చర్చలు జరపడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనతో సమావేశం కావాలని అభ్యర్థించారని ట్రంప్ తెలిపారు. తాను నాటో సదస్సు నుంచి వచ్చిన తర్వాత.. వచ్చే వారంలో చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. తామిద్దరం చాలా బాగా కలిసిపోతామన్నారు. కానీ తమలో బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసని తనను తాను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. శుక్రవారం ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారని.. అమెరికాలో త్వరలో భేటీ కావాలని నిర్ణయించుకున్నారని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు