
Fasal Bima Yojana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్-2026, రబీ 2026-27 సీజన్లకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (Fasal Bima Yojana), వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు జీవో నంబర్ 34 విడుదల చేసింది. ఇందుకోసం రూ.250 కోట్లు మంజూరు చేస్తూ, పాత క్లస్టర్లు, జిల్లాల ప్రాతిపదికన నూతన బీమా కంపెనీల భాగస్వామ్యంతో స్వచ్ఛంద నమోదు పథకాన్ని పునరుద్ధరించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఏడాది నుంచి ‘అగ్రిస్టాక్ ఫార్మర్ ఐడీ’ తప్పనిసరి చేయడంతో కౌలు రైతులకు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసే వారికి ఈ బీమా వర్తించని పరిస్థితి ఏర్పడింది. ఈ నిబంధన నుండి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ, ప్రస్తుతానికి వారి నమోదుపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు జూలై 15 వరకు మాత్రమే గడువు ఉండటంతో రైతులకు కేవలం 9 రోజుల సమయమే మిగిలింది. ఇంత తక్కువ వ్యవధిలో రైతు ఐడీ, ఈ-పంట, బ్యాంకు ప్రక్రియలు పూర్తి చేయడం కష్టమని, ప్రభుత్వ ఆలస్య నోటిఫికేషన్ వల్ల వేలాది మంది రైతులు బీమా సౌకర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి