
ప్రపంచీకరణ పెరిగిన ఈ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి సమాచారం, సాంకేతికత, ఆస్తులతో పాటు ఆర్థిక వనరులు సులభంగా మారుతున్నాయి. విద్య, వైద్యం, విపత్తు సహాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు (NGOలు) విదేశీ విరాళాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. భారత్లో కూడా అనేక సంస్థలు ఈ విదేశీ నిధులతో సామాజిక అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. అయితే, విదేశాల నుంచి వచ్చే డబ్బు ఏ పనులకు ఖర్చు అవుతోంది? దానివల్ల దేశ భద్రతకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఏమైనా ప్రమాదం ఉందా? అని చూడటం ప్రభుత్వాల బాధ్యత. అందుకే ఈ విదేశీ నిధులను క్రమబద్ధీకరించడానికి మన దేశంలో 'ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్' (FCRA) అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ' ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026' ప్రవేశపెట్టడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ, రగడ జరుగుతోంది. ఎఫ్సీఆర్ఏ అనేది భారత్లోని వ్యక్తులు, సంస్థలు, ఎన్జీవోలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు లేదా నిధులు స్వీకరించడాన్ని నియంత్రించే ఒక కేంద్ర చట్టం. దీనిని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ చట్టం ఎవరెవరు విదేశీ నిధులు తీసుకోవచ్చు, ఏ నిబంధనలు పాటించాలి, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టంగా చెబుతుంది. • పారదర్శకత: విదేశీ విరాళాలు పొందే ప్రతి సంస్థ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. నిర్దేశిత బ్యాంకు ఖాతా ద్వారానే డబ్బులు తీసుకోవాలి. • జవాబుదారీతనం: ప్రతి ఏటా వార్షిక ఆడిట్ రిపోర్టులను ఆన్లైన్లో సమర్పించాలి. ఎంత డబ్బు వచ్చింది, ఎవరు ఇచ్చారు, దేనికి ఖర్చు చేశారో పూర్తి వివరాలు వెల్లడించాలి. • సార్వభౌమాధికార రక్షణ: దేశ భద్రతకు, ప్రజాస్వామ్య ప్రక్రియలకు భంగం కలిగించేలా విదేశీ నిధులు వాడకుండా నిరోధించడం. • పరిమితులు: రాజకీయనాయకులు, ఎన్నికల అభ్యర్థులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, పత్రికా సంపాదకులు విదేశీ నిధులు తీసుకోకూడదు. ఎఫ్సీఆర్ఏ చట్టం