
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. గత వారం ఆయన `డ్రాగన్` చిత్ర షూటింగ్లో గాయపడ్డారు. భుజానికి బలమైన గాయమైంది. ఇన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఎన్టీఆర్కి నేడు బుధవారం సర్జరీ చేశారు. కిమ్స్ లో ఆయనకు ఈ సర్జరీ జరిగింది. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి సారథ్యంలోని స్పెషలిస్ట్ ల బృందం డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూధన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని.. తారక్కి ఆపరేషన్ చేసినట్టు తాజాగా కిమ్స్ ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది. చాలా డిటెయిలింగ్ సర్జరీ ద్వారా పూర్తి స్థాయిలో రికవరీ కోసం ఈ స్పెషలిస్ట్ ల బృందం సర్జరీ చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ విజయవంతం అయ్యిందని, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి రావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ కోలుకోవడం, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండటం అభిమానులకు ఆనందించే విషయమే, కానీ మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ అనేది కొంత కలవరానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వామ్ అనేలా ఉంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఆసుపత్రి పాలవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయి