
ఆదివాసీ రైతులకు ఐటీడీఏ సహకారంతో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్న ది విశాఖ, చింతపల్లి గిరిజన కాఫీ రైతుల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక పరిమిత సంఘం(మ్యాక్స్) ఎట్టకేలకు కాఫీ గింజలను ఓ ప్రైవేటు కంపెనీకి విక్రయించింది. సరైన మద్దతు ధర లభించక ఆరు నెలలుగా కాఫీ గింజలను మ్యాక్స్ గోదాములకే పరిమితం చేసింది. గింజలను భద్రపర్చే పరిస్థితి లేక బెంగళూరుకి చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి కిలో రూ.482లకు విక్రయించింది. అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధర భారీగా తగ్గిపోవడంతో ఈ ఏడాది రైతులకు బోనస్ ప్రశ్నార్థకంగా మారింది. చింతపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు పండించిన కాఫీకి అంతర్జాతీయ ధరలు అందించేందుకు టీడీపీ ప్రభుత్వం 2016లో మ్యాక్స్ని ఏర్పాటు చేసింది. మ్యాక్స్ నిర్వహణకు మూలధనాన్ని ట్రైకార్ నుంచి సమకూర్చింది. ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్కి అనుబంధంగా చింతపల్లిలో రూ.మూడు కోట్లతో అత్యాధునిక కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ని ఏర్పాటు చేసింది. మ్యాక్స్లో 1,400 మంది గిరిజన రైతులు శాశ్వత సభ్యులుగా ఉన్నారు. ప్రతి ఏడాది ఏజెన్సీలోని 11 మండలాల నుంచి 16వేల మంది రైతులు కాఫీ పండ్లను మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ముందు ఏడాది ధరల ఆధారంగా కిలోకి తొలి ధర చెల్లించి, గింజలు మార్కెటింగ్ చేయగా వచ్చిన ఆదాయం నుంచి బోనస్ చెల్లిస్తున్నారు. 2024-25లో రైతులకు తొలి ధరగా కిలోకి రూ.44 చెల్లించి, గింజలు విక్రయించగా వచ్చిన లాభాల నుంచి రెండు విడతల్లో కిలోకి రూ.16 బోసన్ చెల్లించారు. గిరిజన కాఫీ రైతులు, మ్యాక్స్కి 2025-26లో అంతర్జాతీయ ధరలు భారీగా దెబ్బతీశాయి. ఈ ఏడాది మార్కెట్ ప్రారంభంలో కాఫీకి గరిష్ఠ ధర లభించింది. కిలో పార్చిమెంట్కి రూ.550-560 ధర పలికింది. దీంతో గిరిజన సహకార సంస్థ కిలో పార్చిమెంట్కి రూ.450 మద్దతు ధర ప్రకటించింది. అయితే కాఫీ ఉత్పత్తిలో దిగ్గజాలైన బ్రెజిల్, వియత్నంలో కాఫీ దిగుబడులు గణనీయంగా పెరగడంతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ