
Seven Sisters : భారతదేశంలో ఈశాన్య ప్రాంతం అనగానే మన కళ్లముందు మెదిలేది దట్టమైన అడవులు, ఎత్తైన పర్వత శ్రేణులు, పచ్చని తేయాకు తోటలు, కంటికింపుగా ఉండే జలపాతాలు, విలక్షణమైన తెగల సంస్కృతులు. ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరంగా భావించే ఈ ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను యావత్ ప్రపంచం "సెవెన్ సిస్టర్స్" (ఏడుగురు సోదరీమణులు) అని ఆప్యాయంగా పిలుస్తుంటుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర... ఏడు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 'సెవెన్ సిస్టర్స్'. అయితే ఈ ఏడుగురి పక్కనే ఉండే సిక్కింను మాత్రం వీరికి ఏకైక "సోదరుడు" (ఓన్లీ బ్రదర్) గా అభివర్ణిస్తారు. అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి? ఈ ఏడు రాష్ట్రాలను అక్కాచెల్లెళ్లుగా, సిక్కింను సోదరుడిగా ఎందుకు పిలుస్తారు? ఈ ఆసక్తికరమైన విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈశాన్య భారత్లోని ఏడు రాష్ట్రాలకు 'సెవెన్ సిస్టర్స్' అనే పేరు వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1972లో ఈ ప్రాంతంలో నూతన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ సమయంలో త్రిపురకు చెందిన ప్రముఖ పత్రికా రచయిత, రేడియో వ్యాఖ్యాత అయిన 'జ్యోతి ప్రసాద్ సైకియా' ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ మొదటిసారిగా ఈ ఏడు రాష్ట్రాలను కలిపి "సెవెన్ సిస్టర్స్" అని సంబోధించారు. ఆ తర్వాత ఆయన ఈ రాష్ట్రాల మధ్య ఉన్న భౌగోళిక, సామాజిక, ఆర్థిక అనుబంధాలు, పరస్పర ఆధారపడటం గురించి వివరిస్తూ 'ల్యాండ్ ఆఫ్ సెవెన్ సిస్టర్స్' అనే పుస్తకం రాశారు. ఒకే కుటుంబంలో పుట్టిన అక్కాచెల్లెళ్లు విడివిడిగా తమదైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఒకరిపై ఒకరు ఎలా ఆధారపడతారో... ఈ ఏడు రాష్ట్రాలు కూడా అలాగే ఉంటాయని ఆయన అభివర్ణించారు. ఆ పేరు నాటి నుంచి నేటి వరకు ప్రాచుర్యంలో ఉండిపోయింది. భారత్ కు ఈశాన్యంగా ఏడు రాష్ట్రాలు కేవలం ఒకే ప్రాంతంలో ఉండటమే కాకుండా జీవన విధానంలోనూ, రవాణాలోనూ ఒకదానిపై ఒకటి