
ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి.. పశ్చిమాసియా యుద్ధానికి ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తోన్న అంశం ఇది. ఈ జలమార్గంపై నియంత్రణ తమకే ఉందంటూ ఇరాన్, అమెరికా గత కొన్ని రోజులుగా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ఒక అడుగు ముందుకేసి.. ‘హర్మూజ్ (Strait of Hormuz) ఇక మా భూభాగమే’ అని ప్రకటించుకున్నారు. దీన్ని ఇరాన్ ఖండిస్తున్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ కీలక జలసంధి టెహ్రాన్ చేయి దాటిపోతున్నట్లే కన్పిస్తోంది. హర్మూజ్పై ఇరాన్ (Iran) 80శాతం పట్టు కోల్పోయినట్లేనని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. (US-Iran War) హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు రెండు మార్గాల్లో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా.. రెండోది ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానెల్. ఇది అమెరికా సూచించిన ఐరాస అధీకృత రవాణా మార్గం. అయితే, హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉందని చెబుతోన్న ఇరాన్.. ఒమన్ రూట్లో వెళ్తోన్న నౌకలపై పదే పదే దాడులు చేస్తోంది. అయినప్పటికీ.. చాలా నౌకలు ఇదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. గత రెండు వారాలుగా ఒమన్ మార్గంలోనే 80శాతానికి పైగా నౌకలు హర్మూజ్ను దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా నౌకాదళాలు కల్పిస్తోన్న భద్రతతో ఈ నౌకలు ఒమన్ తీరం నుంచి ప్రయాణిస్తున్నాయని సదరు డేటా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోతున్నట్లు స్పష్టమవుతోందని కెప్లెర్ క్రూడాయిల్ అనాలిసిస్ హెడ్ హోమాయూన్ అభిప్రాయపడ్డారు. నెల క్రితం వరకు ఒమన్ మార్గంలో ఎలాంటి నౌకల ట్రాఫిక్ను కెప్లెర్ గుర్తించలేదు. కానీ, రెండు వారాల నుంచి ఈ రూట్లో రాకపోకలు గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ దేశాలు హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్ను దాటడానికి అతిపెద్ద క్రూడాయిల్ ట్యాంకర్లను వినియోగిస్తున్నాయి. తర్వాత గల్ఫ్ ఆఫ్