
కొత్త బిల్లు ప్రవేశపెట్టిన మార్క్ బెర్మన్ శాక్రమెంటో (అమెరికా): కాలిఫోర్నియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇక గడ్డుకాలమే. ఎందుకంటే.. ఇకపై డబ్బు తీసుకుని రాజకీయ ప్రచారం చేస్తే.. ఆ విషయాన్ని పోస్టుల్లోనే స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయని వారిపై జరిమానా విధించేందుకు కాలిఫోర్నియా రాష్ట్రం పరిశీలిస్తోంది. కాలిఫోర్నియాతోపాటు టెక్సస్ రాష్ట్రం కూడా ఈ విషయమై ఇప్పటికే తమ విధానాలను స్పష్టం చేశాయి. డబ్బు తీసుకుని ప్రచారం చేస్తూంటే ఆ విషయాన్ని తమ పోస్టుల్లో స్పష్టంగా చెప్పాలని కంటెంట్ క్రియేటర్లకు స్పష్టం చేశాయి. ఇలా చేయని వారిపై జరిమానా విధించేందుకు కాలిఫోర్నియా ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇన్ఫ్లుయెన్సర్ల సాయంతో ఓట్లు సంపాదించుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించడం కొత్తేమీ కాదు. పార్టీలు చాలాకాలంగా ప్రముఖ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్లో కొంత మార్పు వచి్చంది. పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న వారితోపాటు లక్ష కంటే తక్కువ మంది ఫాలోయర్లు ఉన్న వారినీ పార్టీలు వాడుకోవడం మొదలైంది. తద్వారా పార్టీలకు నిర్దిష్టంగా కొంతమందిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేసే అవకాశం దొరుకుతోంది. దీంతో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన పారదర్శకత నిబంధనలు కంటెంట్ క్రియేటర్లకు కూడా వర్తింప చేయాలన్న చర్చ మొదలైంది. 2028 నాటి అధ్యక్ష ఎన్నికల్లోనే కాకుండా.. త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లోనూ కంటెంట్ క్రియేటర్లు కీలకపాత్ర పోషిస్తారని అంచనా. కేంద్ర స్థాయిలో నిబంధనల లేమి కంటెంట్ క్రియేటర్లు తాము డబ్బు తీసుకున్నామని చెప్పే విషయమై కాలిఫోర్నియా సెనేటర్ ఆడమ్ షిఫ్ గత నెలలో కేంద్ర స్థాయిలో ఒక బిల్లు ప్రవేశపెట్టినా దానిపై ఇంకా ఓటింగ్ జరగాల్సి ఉంది. ఇదే సమయంలో ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి నిబంధనను రూపొందించాలని కొన్ని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కాలిఫోర్నియాలోనూ ఇలాంటి చట్టం ఆమోదించి మూడేళ్లవు తున్నా అమలు మాత్రం చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో డెమోక్రాట్ల సభ్యుడు మార్క్ బెర్మన్ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు