
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ‘లెనిన్’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). ఈ సినిమా సక్సెస్ అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. తాను ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకోవడం అంత సులువుగా జరగలేదని వెల్లడించారు. తాను పుట్టిన కొద్ది రోజులకే తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని భాగ్యశ్రీ తెలిపారు. కుటుంబ పోషణ కోసం తన తండ్రి పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు. ‘‘మా నాన్న వేరొకరిని బతిమిలాడటం నేను చూశాను. ‘దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి. నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు’ అని ఆయన ఒకరి దగ్గర ప్రాధేయపడటం చూశాను’’ అని ఆమె చెప్పారు. దీంతో కష్టపడి డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే బలమైన సంకల్పం తనలో ఏర్పడిందని ఆమె వివరించారు. ఇటీవల జరిగిన ‘లెనిన్’ సక్సెస్ మీట్లోనూ భాగ్యశ్రీ భావోద్వేగానికి గురైయ్యారు. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. తనను అభిమానులు ఎప్పుడూ ప్రోత్సహించారని కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రలో జన్మించిన భాగ్యశ్రీ బోర్సే.. ‘చందు ఛాంపియన్’, ‘యారియాన్ 2’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలతో తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’, విజయ్ దేవరకొండతో కలిసి ‘కింగ్డమ్’, రామ్ పోతినేనితో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాల్లో నటించారు. దుల్కర్ సల్మాన్తో కలిసి నటించిన ‘కాంత’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా ‘లెనిన్’తో సక్సెస్ అందుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి