
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి వరకూ వెండితెరపై విడుదలయ్యే సినిమాలకు మాత్రమే ఉండే సెన్సార్ నిబంధన ఇకపై ఓటీటీ సినిమాలకూ వర్తించేలా కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం ఓటీటీ కంటెంట్ను ఐటీ (డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు 2021 ప్రకారం నియంత్రిస్తారు. ఈ చిత్రాలకు సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేషన్ అవసరం లేదు. దీంతో సెన్సార్ నిరాకరించిన, వివాదాస్పదమైన పలు చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా నిబంధనలను సవరించి, ఓటీటీ చిత్రాలకు కూడా ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి (Censor) చేసే ఆలోచనలో ఉంది. కేవలం సినిమాలకే కాకుండా, భవిష్యత్తులో వెబ్ సిరీస్లను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలా.. వద్దా అనే అంశంపై ప్రభుత్వం ప్రస్తుతం చర్చలు జరుపుతోందని సమాచారం. ఇటీవల దిల్జింత్ దొసాంజే నటించిన ‘సత్లుజ్’ (Satluj) తీవ్ర వివాదాస్పదమైంది. ఆ చిత్రానికి సెన్సార్ బోర్డు భారీ కట్స్ సూచించింది. దీనికి నిరాకరించిన చిత్రబృందం ఎలాంటి కట్స్ చేయకుండా ఓటీటీలో విడుదల చేసింది. అయితే దేశ భద్రత దృష్ట్యా రెండురోజుల్లోనే ఓటీటీ నుంచి దీన్ని తొలగించిన విషయం తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు