
మరో 11 మందికి జీవిత ఖైదు.. గుజరాత్ హైకోర్టు తీర్పు మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం అహ్మదాబాద్: వరుస బాంబు పేలుళ్లతో అహ్మదాబాద్ నగరంలో మారణహోమం సృష్టించిన నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ సభ్యులు 38 మందికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణ దండనను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. మరో 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఒకే కేసులో ఇంత మందికి ఉరి శిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ పేలుళ్లలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 2027 మార్చి 31 లోగా పరిహారం అందజేయాలని జస్టిస్ ఎ.వై.కోగ్జీ, జస్టిస్ సమీర్ దవే ధర్మాసనం తీర్పులో పేర్కొంది. కేసు విచారణ సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 24 మంది నిందితులు టన్నెల్ తవ్వి జైలు నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. అయితే ఆ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. గుజరాత్ హైకోర్టు తీర్పుపై అహ్మదాబాద్ 2008 పేలుళ్ల బాధిత కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న హంతకులను తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. పేలుళ్ల ధాటికి మనుషులు కొవ్వొత్తుల్లా కరిగిపోయారని, ఎగిరిపడిన మృతదేహాలు చెట్లకు వేలాడాయని 18 ఏళ్ల నాటి భయానక దృశ్యాలను గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్తే అక్కడా పేలుళ్లు జరిగాయని, ఉగ్రవాదులకు మానవత్వం ఉండదని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత