
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సెనెటర్, ట్రంప్ సన్నిహితుడు లిండ్సే గ్రాహం (US Senator Lindsey Graham) (71) కన్నుమూశారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై చికిత్స తీసుకుంటుండగా శనివారం సాయంత్రం స్వగృహంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అయితే ఆయన అనారోగ్యానికి కారణాలు వెల్లడించలేదు. 2003 నుంచి యూఎస్ సెనేట్లో సౌత్ కరోలినాకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాతీయ భద్రత, విదేశాంగ విధాన చర్చలు వంటి వాటిలో చురుకుగా వ్యవహరిస్తూ.. దేశంలోని కీలక నేతల్లో ఒకరిగా పేరు పొందారు. అమెరికాకు చెందిన అనేక కీలక అంశాలలో ట్రంప్కు బలమైన మద్దతుదారుగా వ్యవహరించారు. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన సమయంలోనూ ఇస్లామాబాద్పై లిండ్సే గ్రాహం తీవ్ర విమర్శలు చేశారు. పాక్ మధ్యవర్తిగా వ్యవహరించడమే అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ (Israel)పై సుదీర్ఘకాలంగా అది విద్వేషంతో రగిలిపోతోందన్నారు. టెల్అవీవ్కు వ్యతిరేకంగా గతంలో పాక్ (Pakistan) ఉన్నతస్థాయి అధికారులు చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ఇజ్రాయెల్పై నమ్మకం లేనందున అబ్రహాం ఒప్పందంలో పాల్గొనేది లేదని ఖవాజా చేసిన వ్యాఖ్యలను లిండ్సే ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు తనను భయాందోళనకు గురిచేశాయన్నారు. అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపుపై పాక్ వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికా చేసుకొనే దిగుమతులపై 500 శాతం పన్ను విధించాలని డిమాండ్ చేశారు. దీంతో భారత్కు కూడా నాడు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో లిండ్సే గ్రాహం మొదట అధ్యక్ష అభ్యర్థిత్వానికి నామినేషన్ వేశారు. ఓటింగ్ ప్రారంభం కాకముందే 2015 డిసెంబరులో తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించిన లిండ్సే ఆ తర్వాత ట్రంప్ మద్దతుదారుగా.. సన్నిహిత మిత్రుడిగా మారారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ