
అమరావతి: అమరావతి రైతులది త్యాగమే కాదు.. స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని సీఎం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతులు, స్థానికులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఏమవుతుందో తెలియని స్థితిలో అందరం ఉన్నాం. రాజధాని ఎక్కడ నిర్మించాలో అర్థం కాని పరిస్థితి. శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. మెజారిటీ ప్రజలు అమరావతినే సూచించారు. రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించి నిర్మాణానికి సంకల్పించా.. మరి భూములు కావాలి కదా? మహానగరంగా ఎలా చేయాలని ఆలోచిస్తే.. ల్యాండ్పూలింగ్ కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేస్తే బాగుంటుందని ఆలోచించా. ఒక్కమాట చెప్పగానే.. నన్ను నమ్మి భూములిచ్చేందుకు అన్నదాతలు ముందుకొచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన 58 రోజుల్లోనే రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. 33వేల ఎకరాలు ఇచ్చేందుకు.. 29వేల మంది రైతులు ముందుకొచ్చారు. అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’’ అని నాటి సంగతులను సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, నాదెండ్ల మనోహర్, తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు