
పశ్చిమ బెంగాల్లోని బరుయిపూర్ (Baruipur)లో 12 ఏళ్ల బాలిక దారుణ అత్యాచారం, హత్య సంఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఏడాది మేలో ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన సువేదు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది మొదటి పెద్ద సవాలుగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించడమే కాదు, చీలికలతో పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నామని సంబరపడిన బీజేపీకి ఇప్పుడు.. ఈ రేప్, హత్య ఘటన షాకులిస్తోంది. అదే సమయంలో మమతా బెనర్జీకి మళ్లీ పుంజుకునేందుకు అత్యంత తక్కువ సమయంలోనే కొత్త అవకాశం కల్పించింది. జులై 4న సాయంత్రం 4.30 గంటల సమయంలో స్నేహితురాలి పుట్టినరోజు బహుమతి కొనేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ఆ చిన్నారి తిరిగి రాకపోవడంతో కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదు. దీంతో తామే సీసీటీవీ ఫుటేజ్ చూసి దర్యాప్తు చేపట్టి, నీటిలో ముంచి చంపిన దారుణాన్ని బయటపెట్టారు. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం, ఆ బాలికను అత్యాచారం చేసి, కొట్టి, కాటేసి తలపై బలమైన వస్తువుతో కొట్టి, ఇప్పటికీ ప్రాణాలున్నప్పుడే గన్నీ బ్యాగ్లో పెట్టి కొలనులో విసిరారు. ఊపిరితిత్తులు, కడుపులో నీరు ఉండటం దీనిని నిరూపిస్తోంది. ఈ విషయాలు వెలుగులోకి రాగానే బరుయిపూర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత కామెంట్స్..! విచారణపై తేల్చేసిన సుప్రీం..!ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ముఖ్య నిందితుడు ఆనంద సర్దార్ను పట్టుకుని పోలీసులకు అప్పగించినా, అతడు రహస్యంగా పోలీసు క్యాంపు నుంచి తప్పించుకున్నాడు. బీజేపీ నేత శాంతను మండల్ ఒక నిందితుడికి సహాయం చేశాడని, అతని ఇంటిని కోపంతో స్ధానికులు ధ్వంసం చేశారు. అయితే మండల్ ఇది అబద్ధమని, పోలీసులకు సహకరించడానికే ప్రయత్నించానని అతని చెప్తున్నాడు. ఈ ఘటనతో ఆగ్రహం మరింత పెరిగి, ఇంద్రజిత్ తంతి (26) అనే వ్యక్తిని ప్రజలు గుంపుగా చంపేశారు.