
ట్రాక్టర్తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఓ సినిమాలో నటుడు ద్విచక్రవాహనంపై మూట కట్టుకొని వెళ్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేస్తారు. ఎటు వెళ్తున్నావని, మూటలో ఏముందని అడుగుతారు. బీదర్కు ఇసుక తీసుకెళ్తున్నానని చెప్పడంతో ఆలోచనలో పడతారు. అంతదూరం ఇసుక తీసుకెళ్లడం ఏంటని తికమకకు గురవుతారు. చివరికి ఆ వ్యక్తి చెప్పేదాకా.. అతను తరలించింది ఇసుక కాదని, ద్విచక్ర వాహనాలని తెలుసుకోలేకపోతారు. సరిగ్గా ఆ సినిమా సీన్ను తలపించేలా.. రాష్ట్రంలోనూ ఓ వ్యక్తి రైతు ముసుగులో ట్రాక్టర్ సాయంతో గంజాయిని యథేచ్ఛగా తరలించాడు. చివరికి పోలీసులకు అందిన సమాచారంతో పట్టుబట్టాడు. సాధారణంగా ఒక ప్రాంతంలో పనులు లేనప్పుడు ట్రాక్టర్లను వాటి యజమానులు ఇతర జిల్లాల్లో పనులు ఉన్న చోటుకు తీసుకెళ్తారు. ప్రత్యామ్నాయ ఉపాధి పొందుతుంటారు. దీనినే గంజాయి తరలించేందుకు ఎంచుకున్నాడీ అక్రమార్కుడు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాక్టర్తో వెళ్తాడు. చెక్పోస్టుల దగ్గర పోలీసులు ఆపినప్పుడు రైతునని చెబుతాడు. తమ ఊర్లో పనులు లేకపోవడంతో మరో చోటుకు వెళ్తున్నానంటూ నమ్మిస్తాడు. కానీ, ఎక్కడా ఒక్క ఎకరాలోనూ పనిచేయడు. ట్రాక్టర్ వెనకాల తగిలించిన వరి గడ్డి కట్టలు కట్టే యంత్రంలో డోమ్ కింద గంజాయి ప్యాకెట్లు అమర్చుకుని తరలిస్తుంటాడు. ఎట్టకేలకు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి శివారులో 16వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం నిర్వహించిన తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. సుమారు రూ.26 లక్షల విలువ చేసే 52.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని సమీప మండలమైన శంఖవరం నుంచి ఇతర రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. ట్రాక్టర్తోపాటు నిందితుడైన కూచిపూడి ఫ్రాన్సిస్ను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కట్టుబడిపాలేనికి చెందిన అతడిపై ఇప్పటికే మూడు కేసులు ఉన్నట్లు డీఎస్పీ తిలక్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి