తెలంగాణలో 22ఏ లేదా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. చట్టబద్ధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సాంకేతిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్తగా తమ ప్రభుత్వం ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని వెల్లడించారు. 22ఏ, పీఓబీ అంశంపై మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు.. జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను జిల్లాల వారీగా పరిశీలించారు. అర్హులైన బాధితులకు వీలైనంత త్వరగా ఊరట కల్పించాలని అధికారులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. భూముల రెగ్యులరైజేషన్కు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతులు సహా అన్ని రికార్డులను ఈనెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఈ విధానం ద్వారా బోగస్ లేదా ఫోర్జరీ పత్రాలను గుర్తించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావచ్చని మంత్రి చెప్పారు. పహానీలను కూడా సబ్ రిజిస్ట్రార్లకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిషేధిత జాబితాలోని ఆస్తుల రిజిస్ట్రేషన్ దరఖాస్తులను సబ్ రిజిస్ట్రార్లు గుడ్డిగా తిరస్కరించకూడదని పొంగులేటి స్పష్టం చేశారు. ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సిన పరిస్థితి ఉంటే కారణాలను పరిశీలించేందుకు 3 రోజుల సమయం తీసుకుని.. స్పష్టమైన వివరణ ఇవ్వాలని సూచించారు. ప్రతి కేసును విడివిడిగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని ఆదేశించారు.ఇకపై నిషేధిత జాబితాకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లకు పంపకుండా నేరుగా జిల్లా కలెక్టర్లకు పంపించాలని మంత్రి పొంగులేటి నిర్ణయించారు. కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్ స్థాయిలోనే సంబంధిత వ్యవహారాలను సమన్వయం చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ల