
Chiranjeevi
ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొంటూ, శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.'షావుకారు' చిత్రంతో ప్రారంభమైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా చిరంజీవి స్మరించుకున్నారు. సుమారు ఏడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ తదితర భాషల్లో వైవిధ్యభరితమైన పాత్రలకు తన సహజ నటనతో ప్రాణం పోశారని కొనియాడారు. ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసిన గొప్ప నటి అని అభివర్ణించారు."భారతీయ చిత్ర పరిశ్రమకు షావుకారు జానకి గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అసంఖ్యాక అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు