
Ayodhya Ram Temple First CEO 2026 : దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయోధ్య రామాలయ పరిపాలన పరిధిలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆలయ నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే దిశగా రామాలయ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎవరనే విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం అధికారికంగా వెల్లడించనుంది. ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్దాస్ నివాసంలో మధ్యాహ్నం నుంచి నిర్వహించే ముఖ్యమైన సమావేశంలో సీఈవో ఎంపిక కమిటీ తమ తుది నివేదికను సమర్పించనుంది.5,500కి పైగా దరఖాస్తులు.. ముగ్గురి పేర్లతో తుది జాబితా!ఆలయ తొలి సీఈవో స్థానం కోసం ఏకంగా 5,585 దరఖాస్తులు అందినట్లు నిపుణుల కమిటీ తెలిపింది. ఈ భారీ సంఖ్యలోని అభ్యర్థుల అర్హతలను నిశితంగా పరిశీలించిన ఎంపిక కమిటీ.. చివరి దశకు చేరుకున్న 16 మంది అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించింది. రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కొహ్లీ, రిటైర్డ్ ఎల్జీ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణులైన సురేష్ హావ్డేలతో కూడిన ఈ ప్రత్యేక కమిటీ సభ్యులు ఇప్పటికే అయోధ్యకు చేరుకుని సమావేశానికి సిద్ధమయ్యారు. వీరు ప్రతిపాదించిన ముగ్గురి పేర్లతో కూడిన షార్ట్లిస్ట్ నుంచి ఒకరి పేరును ట్రస్టు తుది నిర్ణయంగా ఖరారు చేయనుంది.రాజీనామాలు, ఖాళీల నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ..!ఇటీవల కాలంలో అయోధ్య రామాలయంలో భక్తులు అందించే కానుకలు, విరాళాల చోరీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. మరోవైపు ట్రస్టు సభ్యుడిగా సుదీర్ఘ సేవలు అందించిన విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర అకాల మరణం చెందారు. ఇలా ఒకేసారి ఏర్పడిన మూడు కీలక పదవుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ట్రస్టు ప్రధాన కార్యదర్శి, ఇద్దరు నూతన సభ్యుల పేర్లను కూడా ఈ సమావేశంలో స్పష్టం చేయనున్నారు.ముందువరుసలో జగదీశ్ ఆఫ్లే పేరుట్రస్టు తొలి కార్యదర్శిగా మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఆర్ఎస్ఎస్ అనుయాయి, ప్రముఖ విద్యావేత్త జగదీశ్ ఆఫ్లే పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్ పూర్తి చేసిన జగదీశ్ ఆఫ్లే.. గతంలో రామాలయ నిర్మాణ సమయమంతటా ప్రాజెక్ట్ మేనేజరుగా తన నైపుణ్యాన్ని నిరూపించుకుని విశేష సేవలు అందించారు. వీరికి తోడుగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న బజరంగ్ లాల్ బాగ్డాకు సైతం ఈ ట్రస్టు యాజమాన్యంలో కీలక బాధ్యతలు దక్కే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి అయోధ్య రామాలయ తొలి సీఈఓ ఎవరనేది.
Found this helpful?
Share this story with your network







