
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. యూకే, అమెరికా పర్యటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం క్రితమే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అయితే రేవంత్రెడ్డి యూకే పర్యటనకు అనుమతి లభించగా.. అమెరికా పర్యటనకు మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. అమెరికాలో పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం కార్యాలయం షెడ్యూల్ రూపొందించింది. ప్రముఖ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు, తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుపై చర్చలు జరపాలని ప్రభుత్వం భావించింది. చివరికి అనుమతి రాకపోవడంతో సీఎం అమెరికా వెళ్లే కార్యక్రమం రద్దయింది. అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటనను రాజకీయ కోణంలో అడ్డుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడం, రాష్ట్ర యువతకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం తన పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. విద్య, నైపుణ్యాలు, శిక్షణ రంగాల్లో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా అభివృద్ధి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. తన విదేశీ పర్యటన ద్వారా తెలంగాణతో పాటు దేశానికీ ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రేవంత్రెడ్డి అమెరికా పర్యటన రద్దయినప్పటికీ అధికారుల బృందాన్ని మాత్రం అమెరికాకు పంపాలని సీఎం నిర్ణయించారు. ముందుగా రూపొందించిన కార్యక్రమాలను కొనసాగించాలని, ప్రతిపాదిత ఒప్పందాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలపై చర్చలు జరపాలని సూచించారు. తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందేలా ఎంవోయూలు కుదుర్చుకోవాలని ఆదేశించారు