© 2026 nimisham.in
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు ఆస్తులు, హక్కులు ఉన్నపట్టా భూములు చేరడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ పేర్లతో స్పష్టమైన చట్టబద్ధమైన హక్కులు, పత్రాలు ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో భూములను అమ్మాలన్నా లేదా బ్యాంకు రుణాలు పొందేందుకు తాకట్టు పెట్టాలన్నా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో ఈ రకమైన భూములు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి.గతంలో ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమణలకు గురై లావాదేవీలు జరిగిన ఘటనలను పరిశీలించిన హైకోర్టు, 2015, 2024లలో నిషేధిత భూముల జాబితాను సమగ్రంగా నవీకరించాలని రవాణా, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. దీని ప్రకారం 2025 చివర్లో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి రికార్డులను సమకూర్చి కొత్త జాబితాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ప్రక్రియలో ప్రాథమిక మూల సర్వే నంబర్ల ఆధారంగా డేటాను సేకరించడం వల్ల సమస్య జటిలంగా మారింది. ప్రభుత్వ వేలం ద్వారా, జీవోల ద్వారా క్రమబద్ధీకరణ పొందిన స్థలాలు, ప్లాట్లు రికార్డుల్లో ప్రైవేటు ఆస్తులుగా ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో వాటి మూల సర్వే నంబర్లు ఇప్పటికీ ప్రభుత్వ భూములుగానే కొనసాగుతున్నాయి. ఫలితంగా మూల సర్వే నంబర్ను 22ఏలో చేర్చగానే అందులో ఉన్న సబ్-డివిజన్లు, లేఅవుట్లు, ప్రైవేటు ప్లాట్లు కూడా ఆటోమేటిక్గా నిషేధిత పరిధిలోకి వెళ్లిపోతున్నాయి.దీనికితోడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ , ఇనాం, అసైన్డ్, భూదాన్ భూములు, చెరువు శిఖం, బఫర్ జోన్లకు సంబంధించిన సర్వే నంబర్లలో ప్రైవేటు పట్టా భూములు కలిసిపోవడం మరొక కారణం. కోర్టు ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్లు పొందిన ఆస్తులు సైతం రెవెన్యూ రికార్డుల్లో సవరణలు జరగకపోవడం వల్ల ఇప్పటికీ నిషేధిత జాబితాలోనే దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులకు ఊరట కలిగించేందుకు జిల్లాల వారీగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా గ్రామాల స్థాయిలో జాబితాలను సరూర్నగర్, ఉప్పల్
, నారపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో పునఃపరిశీలిస్తున్నాయి.ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిస్కారాన్ని అందించేందుకు డిజిటల్ డేటా అనుసంధానాన్ని వేగవంతం చేస్తోంది. పొరపాటున 22ఏ జాబితాలో చేరిన ప్రైవేటు భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్పుస్తకాలు, పాత రిజిస్ట్రేషన్ పత్రాలు, కోర్టు ఆర్డర్లు, క్రమబద్ధీకరణ పత్రాలను సమర్పించి విచారణకు సహకరించాలని అధికారులు బాధితులకు విజ్ఞప్తి చేస్తున్నారు.