© 2026 nimisham.in
మహిళా సంఘాలకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరల ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. మహిళా సంఘాలకు అందించే చీరల కోసం మే నెలలో 4.62 కోట్ల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటివరకు 1.74 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో నీలం రంగు చీరలను పంపిణీ చేయగా.. ఈ ఏడాది చిలకపచ్చ రంగును ఎంపిక చేశారు. చీరల ఉత్పత్తి ద్వారా రాజన్న సిరిసిల్ల పవర్లూమ్, మ్యాక్స్ సంఘాలకు పని లభించడంతో నేతన్నల్లో ఆశలు పెరిగాయి.ఈ ఏడాది మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న చీరల కోసం ప్రభుత్వం రూ.450 కోట్లను కేటాయించింది. ఇందులో ఇటీవల రూ.142 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. టెస్కోకు నిధులు మంజూరైన వెంటనే చీరల ఉత్పత్తి చేస్తున్న మ్యాక్స్ సంఘాలకు చెల్లింపులు జరగనున్నాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. తొలుత 133 మ్యాక్స్ సంఘాలకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు కేటాయించారు. వీటిలో 80 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసిన 61 సంఘాలను గుర్తించి ఇటీవల రెండో విడతగా మరో 1.62 కోట్ల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చారు.ఉత్పత్తి పూర్తయిన వస్త్రాన్ని టెస్కో సేకరిస్తోంది. ఒక్కో చీరకు జాకెట్ వస్త్రంతో కలిపి 6.6 మీటర్ల మేర తయారు చేస్తున్నారు. ఒక్కో చీర ఉత్పత్తికి సుమారు రూ.238 ఖర్చవుతోంది. దీనికి అదనంగా ప్రాసెసింగ్, ప్రింటింగ్, రవాణా తదితర ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. మొత్తం చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సెప్టెంబరు 20లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. అక్టోబరులో మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో గడువులోగా ఉత్పత్తి పూర్తి చేసేందుకు మ్యాక్స్ సంఘాలు పనులను వేగవంతం చేస్తున్నాయి.మరోవైపు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏకరూప దుస్తుల వస్త్రం విషయంలో నెలకొన్న సమస్యకు కూడా పరిష్కారం లభిస్తోంది. ఫిబ్రవరిలో జిల్లా పరిశ్రమకు 63 లక్షల మీటర్ల వస్త్ర
ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చారు. ఉత్పత్తి ప్రారంభమైన రెండు నెలలకే ఏప్రిల్లో ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం టెస్కోకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాలుగు నెలలుగా నేతన్నలు అయోమయంలో ఉన్నారు. తాజాగా ఇప్పటికే తయారైన వస్త్రాన్ని సేకరించే ప్రక్రియ ప్రారంభమైంది. 2023 నవంబరులోనూ జిల్లా పరిశ్రమ నుంచి దాదాపు రూ.100 కోట్ల విలువైన వస్త్రాన్ని సేకరించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రూ.42 కోట్ల విలువైన వస్త్రానికి లెక్కలు పూర్తయ్యాయి. మరో రూ.50 కోట్ల వరకు విలువైన వస్త్రం ఇంకా పరిశీలించి లెక్కించాల్సి ఉందని అంచనా. ఈ మొత్తాన్ని కూడా త్వరగా విడుదల చేసి ఉత్పత్తిదారులకు చెల్లింపులు చేయాలని నేతన్నలు కోరుతున్నారు. తాజా చీరల ఆర్డర్లు, పెండింగ్ వస్త్రం సేకరణతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.