© 2026 nimisham.in

హరిద్వార్లో ఏటా జరిగే కన్వర్ యాత్ర ముగిసింది. అయితే, యాత్ర అనంతరం నగరం మొత్తం వ్యర్థాలతో నిండిపోయింది. అధికారులు అంచనా ప్రకారం, దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ యాత్రలో భాగంగా సుమారు 4.8 కోట్ల మంది భక్తులు గంగా జలాన్ని సేకరించి వెళ్లారు.యాత్ర ముగిసిన తర్వాత హర్ కీ పౌరి సహా పలు ఘాట్లు, మేళా గ్రౌండ్ పరిసరాల్లో ఎక్కడ చూసినా చెత్త గుట్టలు దర్శనమిస్తున్నాయి. భక్తులు వదిలేసిన పాత దుస్తులు, చెప్పులు, ప్లాస్టిక్ వస్తువులు, మూత్రంతో నిండిన బాటిళ్లు పేరుకుపోయాయి. మహిళల దుస్తులు మార్చుకునే గదుల్లో కూడా ఇలాంటి వ్యర్థాలే కనిపించడం గమనార్హం. ఆన్లైన్లో వైరల్ అవుతున్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతను చూపుతున్నాయి.ఈ నేపథ్యంలో హరిద్వార్ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఆగస్టు 18 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. దీని కోసం అదనంగా 1,000 మంది పారిశుద్ధ్య కార్మికులను, 80కి పైగా వాహనాలను రంగంలోకి దించారు. చెత్త గుట్టలను వేగంగా గుర్తించి తొలగించడానికి డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. భక్తులు వదిలివెళ్లిన ప్లాస్టిక్ షీట్లు, పాత దుస్తులే ఈ వ్యర్థాలలో అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు
.