
ఆంధ్రప్రదేశ్-తమిళనాడు మధ్య కీలకమైన గూడూరు-గుమ్మిడిపూండి రైల్వే మార్గం సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 90 కిలోమీటర్ల గూడూరు-గుమ్మిడిపూండి రైల్వే ప్రాజెక్టుకు రూ.2,229 కోట్ల అంచనా వ్యయం నిర్ణయించారు. ఈ విస్తరణ పనులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త లైన్లతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ప్రయాణికులు, సరకు రవాణాకు అవసరమైన అదనపు సామర్థ్యం అందుబాటులోకి రానుంది. నెల్లూరు, తిరుపతి ప్రాంతాలతో పాటు తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాకు ఈ ప్రాజెక్టు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చనుంది. ప్రస్తుతం గూడూరు-గుమ్మిడిపూండి సెక్షన్ డబుల్ లైన్గా ఉండగా, ట్రాఫిక్ సామర్థ్యం 131 శాతాన్ని దాటింది. దీంతో ప్రయాణికుల రైళ్లు, సరకు రైళ్ల నిర్వహణపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి తరచుగా ఆలస్యాలు ఎదురవుతున్నాయి. ఈ మార్గం చెన్నై-విజయవాడ, చెన్నై-తిరుపతి రైల్వే మార్గాల్లో కీలకమైన అధిక రద్దీ నెట్వర్క్లో భాగంగా ఉంది. అంతేకాకుండా విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, ఈస్ట్ కోస్ట్ ఆర్థిక కారిడార్కు కూడా ఇది కీలక అనుసంధాన మార్గం. ఇప్పటికే చెన్నై-అత్తిపట్టు మధ్య నాలుగు లైన్లు ఉండగా, అత్తిపట్టు-గుమ్మిడిపూండి విస్తరణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. గూడూరు వరకు నాలుగు లైన్ల సామర్థ్యం విస్తరించడం ద్వారా మొత్తం చెన్నై-గూడూరు కారిడార్పై రద్దీ తగ్గే అవకాశం ఉంది. గూడూరు-గుమ్మిడిపూండి రైల్వే ప్రాజెక్టులో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టనున్నారు. స్వర్ణముఖి నదిపై 360 మీటర్ల భారీ వంతెనతో పాటు 21 పెద్ద, 127 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. అదనంగా 34 రోడ్ ఓవర్, అండర్ బ్రిడ్జ్లను నిర్మించే ప్రణాళిక ఉంది. దీంతో రైల్వే సామర్థ్యం పెరగడంతో పాటు సంవత్సరానికి అదనంగా 21.24 మిలియన్ టన్నుల సరకు రవాణా సాధ్యమవుతుందని అంచనా. లాజిస్టిక్స్ వ్యయంలో సంవత్సరానికి రూ.382.15 కోట్ల వరకు ఆదా అవుతుందని రైల్వే అంచనా వేసింది. చెన్నై, కామరాజర్, కృష్ణపట్నం